తుమ్మగూడెం పీఏసీఎస్లో ఎరువుల పంపిణీ పరిశీలించి – రైతులకు APAIMS 2.0 ద్వారా వివరాలు అందించిన ఏవో బి శివశంకర్
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం పీఏసీఎస్ను సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించినట్లు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్ (APAIMS) 2.0 వెబ్సైట్ ద్వారా రైతులకు ఎరువుల కేటాయింపు విధానంపై అవగాహన కల్పించారు. రైతులతో చర్చించి వెబ్సైట్ వినియోగ విధానాన్ని వివరించారు.
వెబ్సైట్లో రైతు ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ పూర్తి చేసిన వెంటనే పంట విస్తీర్ణం, పంట రకం ఆధారంగా దఫాల వారీగా కేటాయించిన డీఏపీ, యూరియా వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో రైతులు తమకు కేటాయించిన ఎరువులను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు.
అలాగే APAIMS వెబ్సైట్ ద్వారా కౌలు రైతులు, వెబ్ల్యాండ్లో నమోదు కాని భూములు సాగు చేస్తున్న రైతులు కూడా ఎరువులు పొందే ప్రక్రియ సులభతరం చేసినట్లు వివరించారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి పంట వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన సహాయక అధికారులు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారని తెలిపారు.