తునికిపాడులో పొలం గట్టు వివాదం.. హత్యాయత్నం కేసులో ఐదుగురు అరెస్ట్
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో పొలం గట్టు వివాదం హత్యాయత్నానికి దారితీసిన ఘటనలో ఐదుగురు నిందితులను గంపలగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. భూ సరిహద్దు విషయంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 23న పొలం గట్టు అంశంపై జరిగిన వివాదం అనంతరం, జూన్ 24 తెల్లవారుజామున నిందితులు కర్రలు, రోకలి బండతో బాధితుడు బిక్షాలు ఇంటి వద్దకు వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడికి తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు గంపలగూడెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 73/2026గా బీఎన్ఎస్ సెక్షన్లు 329(4), 109(1) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులుగా గుర్తించిన వేల్పుల అజయ్, వేల్పుల గోపి, వేల్పుల చిన్ని కృష్ణ, వేల్పుల అనిల్, వేల్పుల చిట్టిబాబులను గురువారం ఉదయం భగవానులపురం ఎక్స్రోడ్ వద్ద ఎస్ఐ కె. శశిధర్ నేతృత్వంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితులను తిరువూరులోని II అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ జేఎఫ్సీఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలను చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని గంపలగూడెం పోలీసులు హెచ్చరించారు.