ఉద్యోగ దరఖాస్తు ఫీజులను వెంటనే తగ్గించాలి: బీసీ సమాజ్ డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు గట్టి షాక్ ఇస్తూ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకు దరఖాస్తు ఫీజును భారీగా పెంచిన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోబోమని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు గతంలో సుమారు రూ.200గా ఉన్న ఫీజును ఏకంగా రూ.1000కు పెంచడం ద్వారా నిరుద్యోగ యువతపై అదనపు ఆర్థిక భారం మోపుతూ వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం వేలాది మంది నిరుద్యోగ యువకులు హాస్టళ్లలో, అద్దె గదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, కుటుంబాలపై ఆధారపడి లేదా అప్పులు చేసి చదువుకుంటున్న వారికి ఈ ఫీజుల పెంపు మరింత భారంగా మారిందని ఆయన తెలిపారు. ఒకే అభ్యర్థి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో, ప్రతి దరఖాస్తుకు రూ.1000 చొప్పున చెల్లించడం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. అందువల్ల నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే పెంచిన జాబ్ అప్లికేషన్ ఫీజును తగ్గించి, నిరుద్యోగులకు అనుకూలమైన విధానాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు