ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి
ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి – వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సుమారు రూ.9 కోట్లు వెంటనే విడుదల చేసి ఉపాధి కూలీలకు చెల్లించాలని సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు కోరారు.
విసన్నపేట మండలం చండ్రుపట్ల ఉపాధి హామీ పనుల ప్రాంతాన్ని సందర్శించిన నాయకులు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ కారణంగా హాజరు నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే, చేసిన పనులకు సంబంధించిన కూలి డబ్బులు సమయానికి అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
ఈ సందర్భంగా కోట కళ్యాణ్ మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు కేటాయించి, జిల్లాలో పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.
ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, నాగలక్ష్మి, కృష్ణవేణి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.