ఉపాధి హామీకి రూ.10 వేల కోట్లు కేటాయించాలి: దుర్గం పుల్లారావు
చాట్రాయి, జూన్ 23: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి గ్రామీణ పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నాయని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు విమర్శించారు. సోమవారం నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిత్తపూరు, జనార్దనవరం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పనుల కోసం రాష్ట్రానికి రూ.9,346 కోట్ల నుంచి రూ.10,648 కోట్ల వరకు నిధులు కేటాయించేవారని, ఈ ఏడాది కేవలం రూ.837 కోట్లకు పరిమితం చేయడం పేదలపై తీవ్రమైన అన్యాయమని అన్నారు. ఇందులో కూడా కూలీల పనుల కోసం రూ.735 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2.6 లక్షల కుటుంబాలకు మాత్రమే పని లభిస్తుందని, గతంలో జిల్లాకు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తే ఈ ఏడాది కేవలం 9,461 కుటుంబాలకే పని దొరుకుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామీణ పేదలు, సన్నకారు రైతులు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతున్నారని, నిధుల కోతతో వారి జీవనోపాధి సంక్షోభంలో పడిందన్నారు.
గత 20 ఏళ్లలో ఉపాధి హామీ చట్టానికి ఇంత తీవ్రంగా నిధుల కోత విధించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. 125 రోజుల పని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, తగిన నిధులు లేక ఆ హామీ అమలుకావడం లేదని విమర్శించారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించే కొత్త విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించకపోవడంతో కేంద్రం కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. ఫేస్ యాప్ అమలు కారణంగా నెట్వర్క్ సమస్యలతో కూలీలు గంటల తరబడి హాజరు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని, అనేక ప్రాంతాల్లో పని దొరికినా హాజరు నమోదు కాకపోవడంతో కూలీలు నిరాశతో వెనుదిరుగుతున్నారని తెలిపారు. కనీస వేతనాన్ని రూ.700కు పెంచాలని, ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, మహిళలు ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న చాట్రాయి మండల కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని, ఫేస్ యాప్ను రద్దు చేయాలని, ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పారలు, గడ్డపారలు, తట్టలు వంటి పనిముట్లు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు, చాట్ల బాబూరావు, ఆడిమెల్లి వెంకటేశ్వరరావు, చలపతి, బంటు పూజిత, లూసియానా తదితరులు పాల్గొన్నారు.