ఉపాధి కూలీలపై కఠిన నిబంధనలు.. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, చిత్తపూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు ఆరోపించారు.
ఉపాధి హామీ పనులకు వెళ్లిన దళిత కూలీలకు రెండు అడుగుల లోతు, ఒక మీటర్ పొడవు, ఒక మీటర్ వెడల్పుతో గుంత తవ్వి, 15 అడుగుల ఎత్తులో ఉన్న కట్టపై మట్టిని వేయాలని సిబ్బంది నిబంధన విధిస్తున్నారని తెలిపారు. ఎండాకాలం కారణంగా భూమి గట్టిపడిపోయి ఉండటంతో పనులు చేయడం చాలా కష్టంగా మారిందని కూలీలు వాపోయారు.
ఈ నిబంధనలను సడలించాలని కోరగా, "మీ ఇష్టమైతే పని చేయండి, లేకపోతే వెళ్లిపోండి. మాకు ఎంపీడీఓ నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందే" అంటూ అధికారులు నిర్దాక్షిణ్యంగా స్పందించారని కూలీలు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, కలపాల వెంకటేశ్వరరావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే పనిస్థలంలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఆరోపించారు. దీంతో సీపీఐ(ఎంఎల్) కార్యకర్తలు స్వచ్ఛందంగా వాటర్ క్యాన్ల ద్వారా కూలీలకు మంచినీరు అందించారు.
వారం రోజులుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని, పనులు ప్రారంభమవడంతో జీవనోపాధికి ఊరట లభిస్తుందని భావించిన సమయంలో ఈ కఠిన నిబంధనల కారణంగా మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూలీలు తెలిపారు.
ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ఉపాధి కార్మికుల సమస్యలను సహానుభూతితో పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కలపాల వెంకటేశ్వరరావు హెచ్చరించారు.