ఉపాధి పనులు 125 రోజులు కొనసాగించాలి - వేముల బక్కయ్య డిమాండ్
NTODAY NEWS నూజివీడు
ఉపాధి హామీ పనులను నిరాటంకంగా కొనసాగిస్తూ కూలీలకు కనీసం 125 రోజులపాటు పని కల్పించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు. సమస్యపై వెంటనే స్పందించిన నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఈ ఏడాది జనవరి నుంచి ఉపాధి పనులు ప్రారంభించినప్పటికీ, రెండు వారాల తర్వాత ముందస్తు సమాచారం లేకుండానే పనులు నిలిపివేశారని బక్కయ్య తెలిపారు. పనులు ఎందుకు ఆపారనే విషయంపై సంబంధిత అధికారులను ప్రశ్నించినా స్పందన రాలేదన్నారు.
దీంతో పనులు నిరంతరంగా కొనసాగించాలని, పనులు కల్పించని రోజుల కూలి చెల్లించాలని కోరుతూ గ్రామ కూలీల సంతకాలతో పీజీఆర్ఎస్లో నూజివీడు సబ్ కలెక్టర్కు అర్జీ సమర్పించినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను వివరణ కోరడంతో పాటు పనులు నిలిపివేయకుండా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
కూలీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పనులు నిలిపివేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సబ్ కలెక్టర్కు బక్కయ్య ధన్యవాదాలు తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా తీసుకొచ్చిన వి.బి.జి. రాంజీ పథకం కూలీల హక్కులను దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. పేస్ యాప్ సక్రమంగా పనిచేయక చాలామంది కూలీలు పనులకు హాజరు కాలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా హాజరు నమోదు చేసి పనులు కల్పించాలని కోరారు.
వి.బి.జి. రాంజీ పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, 200 రోజుల పని కల్పించాలని, రోజుకు రూ.700 కూలి చెల్లించాలని బక్కయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె పాము భవాని తదితర కూలీలు పాల్గొన్నారు.