ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన ముసునూరు, ఆగస్టు 20: భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈనెల 24న ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో పర్యట
ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన
ముసునూరు, ఆగస్టు 20: భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈనెల 24న ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు.
ఏలూరు ఐజీ పీ.జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడలతో కలిసి హెలిపాడ్, బహిరంగ సభా ప్రాంగణం, వాహనాల రాకపోకల మార్గాలను పరిశీలించారు. అనంతరం గౌర్మెట్ పాప్కార్నికా సంస్థలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ముసునూరులోని గౌర్మెట్ పాప్కార్నికా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే నూతన పాప్కార్న్ సీడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.
పాప్కార్న్ ఉత్పత్తికి కృషి చేస్తున్న రైతులు, భాగస్వాములను ఉపరాష్ట్రపతి సన్మానించనున్నట్లు తెలిపారు. హెలిపాడ్, రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
అత్యంత ప్రముఖుల పర్యటన కావడంతో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని, గౌర్మెట్ పాప్కార్నికా సంస్థ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఫ్యాక్టరీలోని వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు.
కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.