వాయుగుండం ప్రభావం.. ఏపీలో వర్షాలకు అవకాశం
23 వరకు పలు జిల్లాల్లో వానలు.. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి క్రమంగా ఉత్తర దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆగస్టు 18 నుంచి 23వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, ఆగస్టు 19 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హుకుంపేట, పెదబయలు మండలాల్లో వర్ష తీవ్రత కనిపించింది. కొండ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ అధికారులు సూచించారు. అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఉండవద్దని సూచించారు.