వేపలసింగారంలో ఆసక్తికర ఘటన....
వేపలసింగారంలో ఆసక్తికర ఘటన.. ఆన్లైన్లో కూతురి పెళ్లి చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతులు తమ ఏకైక కుమార్తె హిమబిందు వివాహాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హిమబిందుకు ఎన్టీఆర్ జిల్లా చెందిన రోహిత్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి అమెరికాలో వీరి వివాహం ఘనంగా జరిగింది.
విదేశాల్లో జరిగిన పెళ్లి వేడుకకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయిన తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా వివాహాన్ని వీక్షించారు. కుమార్తెకు ఆశీస్సులు అందిస్తూ అక్షింతలు చల్లారు. అనంతరం వేపలసింగారం గ్రామంలో బంధువులు, స్నేహితులు, గ్రామస్థులకు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.
దూర దేశంలో పెళ్లి జరిగినా.. తల్లిదండ్రుల ఆశీర్వాదం మాత్రం ఆన్లైన్ వేదికగా కుమార్తెకు చేరింది. ఈ ఘటన గ్రామస్థులను ఆకట్టుకుంది.