వైభవంగా రేణుక ఎల్లమ్మ, లక్ష్మీ ఉప్పలమ్మ కళ్యాణం
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఊట్కూర్ రోడ్డులో ఉన్న శివ నాగమల్లేశ్వరి స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహర్షి, లక్ష్మీ ఉప్పలమ్మ–మునిరాజు కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు.
ఆలయ వ్యవస్థాపకులు కొండేటి నారాయణస్వామి, వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ తంతును నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కళ్యాణ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి పెనుగొలనుతో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.