వడ్లమాను గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ పోలీసు సిబ్బందితో కలిసి వడ్లమాను గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళలపై జరిగే నేరాల నివారణ, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, పోక్సో చట్టం, నూతన క్రిమినల్ చట్టాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికలపై వేధింపులు, దాడులు, బాలలపై లైంగిక నేరాలపై ఉన్న చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదు చేసే విధానం, పోలీసుల సహకారం గురించి వివరించారు. చిన్నారుల రక్షణ కోసం పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలను తెలియజేశారు.
అదేవిధంగా నూతన క్రిమినల్ చట్టాల్లో వచ్చిన మార్పులు, వాటి అమలు విధానం, ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం అందిస్తే తక్షణ పోలీసు సహాయం అందుతుందని తెలిపారు. అలాగే అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని చట్టాలు, భద్రతా చర్యలపై అవగాహన పొందారు.