విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
- ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనం: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో 95.72 శాతం పురోగతి సాధించి మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గత విద్యా సంవత్సరంలో 43,072 మంది విద్యార్థులుండగా.. ఈ ఏడాది అదనంగా 2,278 మంది చేరడంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 45,350 కి చేరుకుందని, తద్వారా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలను వెనక్కి నెట్టి మంచిర్యాల మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. మందమర్రి, జైపూర్ మండలాలు 100 శాతం నమోదు సాధించగా, మరో 8 మండలాలు 96 శాతానికి పైగా పురోగతి కనబరిచాయి. ఇటీవల 3,352 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరడం ప్రభుత్వ విద్యపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో స్మార్ట్ టీవీలు, ఐసీటీ ల్యాబ్లు, డిజిటల్ విద్యతో పాటు 82 పాఠశాలల్లో కొత్తగా కంప్యూటర్ టీచర్లను నియమించామని, కస్తూరిబా, ఆదర్శ పాఠశాలల్లో రెసిడెన్షియల్ వసతులు కల్పించామని ఆయన వివరించారు.
ఈ అద్భుత ఫలితాల వెనుక విద్యాశాఖ పకడ్బందీ వ్యూహం ఉందని జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో పి. చంద్రయ్య తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ వద్ద చదువు పూర్తిచేసిన విద్యార్థులను పై తరగతుల కోసం స్వయంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే చేర్పించేలా బాధ్యతలు తీసుకున్నారన్నారు. అలాగే పదో తరగతి పాసైన బాలికలను కేజీబీవీల్లో చేర్పించడం, ప్రైవేటు నుంచి వచ్చే విద్యార్థుల బదిలీలను వేగంగా ఆమోదించడం లాంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. అధికారులతో తరచూ జూమ్ సమీక్షలు నిర్వహించడం, ఎంఈవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు, 8 అకాడమిక్ పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించడం వల్లనే బడుల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని వారు స్పష్టం చేశారు