వికసిత్ భారత్ లక్ష్యాలకు తెలంగాణ భాగస్వామ్యం.. కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి
వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి A. Revanth Reddy ప్రధానమంత్రి Narendra Modi గారికి విజ్ఞప్తి చేశారు.
వికసిత్ భారత్ లక్ష్యాలను వేగంగా సాధించేందుకు, జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సత్వర అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ‘సింగిల్ విండో టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు, రాష్ట్ర గవర్నర్ Shiv Pratap Shukla గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు G. Kishan Reddy గారు, Bandi Sanjay Kumar గారు, రాష్ట్ర మంత్రి Komatireddy Venkat Reddy గారు, లోక్సభ సభ్యుడు Konda Vishweshwar Reddy గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “2047 వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో తెలంగాణ తనవంతు భాగస్వామ్యం అందిస్తుంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా తెలంగాణ రైజింగ్ - 2047 లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు.
“మీ సంకల్ప సాధనలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పయనించాలని తెలంగాణ ఆకాంక్షిస్తోంది. తెలంగాణకు సంబంధించిన రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ - మచిలీపట్నం 12 వరుసల రహదారి వంటి ప్రతిపాదనలు మీ ముందుంచాం” అని ప్రధానమంత్రి గారికి గుర్తుచేశారు.
“నా రాష్ట్రం, నా ప్రజల కోసం ప్రాజెక్టుల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. రెండు గంటల సమయం కేటాయించి ఈ ప్రతిపాదనలన్నింటినీ సానుకూలంగా పరిశీలించాలి” అని కోరారు.
“దేశ ఆర్థిక వృద్ధి మహానగరాల్లో వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలను అభివృద్ధి చేస్తేనే దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని అన్నారు.
“దేశ అభివృద్ధి విషయంలో మేం మీతో కలిసి ఉన్నాం. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపాలని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని మీరు నిర్దేశించారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ నుంచి దేశ జీడీపీకి 10 శాతం వాటా అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్కు మీరు పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం మాకుంది” అని పేర్కొన్నారు.
“కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీకు పెద్ద మనస్సు ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు కూడా మీపై అదే నమ్మకం ఉంది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు, ప్రాజెక్టులన్నింటినీ ఆమోదిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్లో నెలకొల్పిన PM MITRA Park (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్) ను ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారితో కలిసి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అలాగే సంగారెడ్డి - జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, మహబూబ్నగర్ - గూడబెల్లూరు జాతీయ రహదారి (ఎన్హెచ్ - 167), కాజిపేట - విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్లో Indian Oil Corporation గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ను జాతికి అంకితమిచ్చారు.