విస్సన్నపేట: చనిపోతే ఆరు అడుగుల స్థలం ఇవ్వండి..
విస్సన్నపేట: చనిపోతే ఆరు అడుగుల స్థలం ఇవ్వండి.. ప్రభుత్వ స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలి: సీపీఎం డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ప్రభుత్వ స్మశాన వాటికల సమస్యను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో 12 గ్రామపంచాయతీలు, 18 శివారు గ్రామాలు ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల్లో సొంత ప్రభుత్వ స్మశాన వాటికలకు స్థలం లేకపోవడం దురదృష్టకరమన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయినా.. ప్రజలు చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు ఆరు అడుగుల స్థలం కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కొనసాగడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వమే స్థలం కొనుగోలు చేసి స్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని, అక్కడ బోరు, షెడ్డు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై గతంలో విస్సన్నపేట మండల తహసీల్దార్ కే. లక్ష్మీ కళ్యాణికి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి మరోసారి వినతిపత్రం అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం విస్సన్నపేట మండల కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం, లక్కన్న బోయిన శ్రీనివాసరావు, రవి తదితరులు పాల్గొన్నారు.