విస్సన్నపేట మండలంలో రైతన్నా మీకోసం కార్యక్రమం ప్రారంభం
ఎల్నినో ప్రభావ నివారణకు రైతులకు సూచనలు
విస్సన్నపేట: ఎల్నినో ప్రభావంతో పంటలకు ఎదురయ్యే నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని విస్సన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లదేవరపల్లి, చండ్రుపట్ల గ్రామాల్లో వ్యవసాయ సహాయ సంచాలకులు కె. శశికళ, మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉషారాణి, రైతు సేవా సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతు క్షేత్రాలను సందర్శించారు. పంటల ప్రస్తుత పరిస్థితి, నీటి లభ్యత, చీడపీడల ఉధృతిని పరిశీలించి రైతులకు తగిన సూచనలు అందించారు.
పంటల పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు రైతులకు వివరించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. పంట బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.