విస్సన్నపేట వెలుగు కార్యాలయంలో అక్రమాలపై వైసీపీ నేతల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: విస్సన్నపేట మండలంలోని వెలుగు కార్యాలయం పరిధిలో శ్రీనిధి, డ్వాక్రా రుణాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వైసీపీ నాయకుల ఆరోపణల ప్రకారం, కొత్త సభ్యురాలిని డ్వాక్రా గ్రూపులో చేర్చేందుకు రూ.500, శ్రీనిధి రుణం మంజూరు చేయడానికి కార్యాలయ ఖర్చుల పేరుతో రూ.3,000 నుంచి రూ.4,000 వరకు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వని పక్షంలో ఫైళ్లు ముందుకు కదలడం లేదని పలువురు డ్వాక్రా మహిళలు తమకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
పేద మహిళల అభివృద్ధి కోసం ఉద్దేశించిన డ్వాక్రా గ్రూపుల్లో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోవడం బాధాకరమని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
అనంతరం జగనన్న కాలనీలకు సంబంధించిన లబ్ధిదారుల పూర్తి జాబితాను అందించాలని మండల తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణికి వినతిపత్రం సమర్పించారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.