విస్సన్నపేటలో డ్వాక్రా నిధుల గోల్మాల్… రూ.50 లక్షలు మాయం
విస్సన్నపేటలో డ్వాక్రా నిధుల గోల్మాల్… రూ.50 లక్షలు మాయం
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మహిళా మండలి డ్వాక్రా సంఘాల నిధుల దుర్వినియోగం ఘటన సంచలనంగా మారింది. సుమారు రూ.50 లక్షల మేర డబ్బులు అక్రమంగా ఉపసంహరించుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
వెలుగు కార్యాలయంలో బుక్ కీపర్గా పనిచేస్తున్న బత్తుల మౌనిక (వివొ) ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఏపీఎం రామకృష్ణ, సీసీ సుందరమ్మ, బ్యాంకు అధికారుల మధ్య కుమ్మక్కు ఉన్నట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.
రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన సుమారు 35 డ్వాక్రా సంఘాల ఖాతాల నుంచి సభ్యులకు తెలియకుండా డబ్బులు తీసుకున్నట్లు బయటపడింది. నకిలీ తీర్మానాలు, సంతకాలతో డబ్బులు డ్రా చేసినట్లు సమాచారం. సాధారణంగా చిన్న సంతకం తేడా వచ్చినా డబ్బులు ఇవ్వని బ్యాంకులోనే ఈ స్థాయి లావాదేవీలు జరగడం అనుమానాలకు తావిస్తోంది.
తమ కష్టార్జిత పొదుపు డబ్బులు మాయం కావడంతో మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విస్సన్నపేట ఇండియన్ బ్యాంకు శాఖ ముందు ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న మౌనిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.