విస్సన్నపేటలో ఎల్నినోపై రైతులకు అవగాహన.. పంటల సంరక్షణపై శాస్త్రవేత్తల కీలక సూచనలు
విస్సన్నపేటలో ఎల్నినోపై రైతులకు అవగాహన.. పంటల సంరక్షణపై శాస్త్రవేత్తల కీలక సూచనలు
విస్సన్నపేట, ఆగస్టు 4:
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం విస్సన్నపేట మండలంలోని తెల్లదేవరపల్లి, చండ్రుపట్ల, విస్సన్నపేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్నినోపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లామ్ వ్యవసాయ శాస్త్రవేత్త టి. శ్రీనివాస్, గరికపాడు వ్యవసాయ పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన డా. యూ. విజయ భాస్కర్ రెడ్డి, డా. టి. జస్వంత్ రెడ్డి పాల్గొని ఎల్నినో ప్రభావం వల్ల ఎదురయ్యే పరిస్థితులు, వివిధ పంటల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, తక్కువ వర్షపాతం సమయంలో అనుసరించాల్సిన సాగు విధానాలపై రైతులకు వివరించారు.
అనంతరం శాస్త్రవేత్తల బృందం పొలాలను సందర్శించి విత్తన గుళికల వినియోగం, అంతర పంటలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు చర్యలు, వరి పంటలో కలుపు నివారణ వంటి అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. విత్తన గుళికల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు కె. శశికళ, వ్యవసాయ అధికారి జి. రాజ్యలక్ష్మి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉషారాణి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.