విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్గా మలచే యత్నం విఫలం
విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్గా మలచే యత్నం విఫలం
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల లంబాడీ తండాకు చెందిన వడిత్య రాజేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజేష్ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజేష్ పని నిమిత్తం విజయవాడ సమీపంలోని క్రికెట్ స్టేడియంకు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ ఫోటోలు పంపాడు. ఆ తర్వాత అతని నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అనుమానం కలిగింది.
మరుసటి రోజు ఉదయం 8:30 గంటల సమయంలో చండ్రుపట్ల మెయిన్ రోడ్ వద్ద ఎన్ఎస్పి కాలువ బ్రిడ్జి సమీపంలో, అతని బైక్తో పాటు కాలువలో అనుమానాస్పద స్థితిలో శవం కనిపించింది. శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విస్సన్నపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శవపంచనామా, ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం చేసిన హత్య అని నిర్ధారించారు.
దర్యాప్తులో భాగంగా, మృతుడి భార్య వడిత్య అలేఖ్యకు చిలక కృష్ణసేనతో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. రాజేష్ను తొలగించేందుకు రూ.3 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
క్రికెట్ గ్రౌండ్లో మద్యం తాగించిన తర్వాత, మత్తులో ఉన్న సమయంలో దిండు తో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు, అనంతరం శరీరంపై దాడి చేసి కారులో నూజివీడు నుంచి విస్సన్నపేటకు తీసుకువచ్చి కాలువలో పడవేసినట్లు వెల్లడైంది.
హత్యను రోడ్డు ప్రమాదంగా మలచేందుకు ప్రయత్నించినా, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిజం బయటపడింది.
ఈ కేసులో నిందితులను తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. గిరిబాబు, సబ్ ఇన్స్పెక్టర్ అర్జున్ రాజు తమ సిబ్బందితో కలిసి పుట్రేల–మల్లెల గ్రామాల మధ్య ఎన్ఎస్పి కాలువ బ్రిడ్జి వద్ద సాయంత్రం 5:30 గంటలకు అరెస్ట్ చేశారు.
పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.