విస్సన్నపేటలో పగిలిన డివైడర్.. పట్టించుకోని అధికారులు!
విస్సన్నపేటలో పగిలిన డివైడర్.. పట్టించుకోని అధికారులు!
రెండేళ్లుగా ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి.. డంపింగ్ యార్డుగా మారిన డివైడర్
విస్సన్నపేట: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట అంబేద్కర్ సెంటర్ నుంచి రెడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై పగులగొట్టిన డివైడర్ రెండేళ్లు కావస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డివైడర్ పగులగొట్టిన ప్రాంతం ప్రస్తుతం చెత్తాచెదారం వేస్తూ డంపింగ్ యార్డుగా మారిపోయింది.
విస్సన్నపేట సచివాలయానికి, పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఈ సమస్య ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హరినాథ్ విమర్శించారు. నిత్యం వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ మార్గంలో పగిలిన డివైడర్ కారణంగా ప్రమాదాలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
డివైడర్ పగిలిన ప్రాంతంలో చెత్త పేరుకుపోవడంతో రహదారి ఇరుకుగా మారుతోందని, రాత్రి వేళల్లో వాహనదారులకు ప్రమాదం మరింత పొంచి ఉందని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి డివైడర్ను పూర్తిగా తొలగించడమో, లేక ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాని వెడల్పును తగ్గించి తిరిగి పునర్నిర్మించడమో చేపట్టాలని డిమాండ్ చేశారు.
రెండేళ్లుగా సమస్య పరిష్కారం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని హరినాథ్ పేర్కొన్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలను సమీకరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.