విస్సన్నపేటలో విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన
విస్సన్నపేటలో విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన
విస్సన్నపేట, ఆగస్టు 6: డిజిటల్ యుగంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులు వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని అధికారులు సూచించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలోని వికాస్ పీజీ క్యాంపస్లో గురువారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, నకిలీ లింకులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, డిజిటల్ భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, సందేశాలు, వెబ్సైట్లు, లింకులను నమ్మరాదని, ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను లేదా సైబర్ హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణకు ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వికాస్ విద్యాసంస్థల అధినేత ఎన్. నర్సిరెడ్డి, మైలవరం ఏసీపీ పెరవల్లి రామచంద్రరావు, తిరువూరు సీఐ కే. గిరిబాబు, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్, విస్సన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎం. అర్జున్ రాజు పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై విలువైన సూచనలు అందించారు.