విశాఖ స్టీల్ ప్లాంట్కు సీఐఎస్ఎఫ్ భద్రత ఉపసంహరణ....
విశాఖ స్టీల్ ప్లాంట్కు సీఐఎస్ఎఫ్ భద్రత ఉపసంహరణ.. కేంద్రం కీలక నిర్ణయం
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మూడు నెలల గడువులోగా సీఐఎస్ఎఫ్ యూనిట్ను ఖాళీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. నవంబర్ 17 నాటికి మొత్తం సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
గతంలో స్టీల్ ప్లాంట్లో సుమారు 1500 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా విధులు నిర్వహించేవారు. 2024 తర్వాత దశలవారీగా బలగాల ఉపసంహరణ కొనసాగింది. ప్రస్తుతం ప్లాంట్లో 350 మంది సెక్యూరిటీ సిబ్బంది, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
తాజా ఆదేశాలతో వీరిని కూడా వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించినట్లు సమాచారం. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతపై అయోమయం నెలకొంది. భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతాయన్న అంశంపై చర్చ జరుగుతోంది.