విశ్రాంత ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి కన్నుమూత
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన విశ్రాంత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి (84) సోమవారం ఉదయం కన్నుమూశారు.
గత కొంతకాలంగా హైదరాబాద్లో తన కుమారుడు చక్రపాణి వద్ద ఉంటున్న రంగారెడ్డి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భార్య కొంతకాలం క్రితమే మరణించారు.
యన్నం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని పలు హైస్కూల్లలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారిగా కూడా పనిచేశారు. విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ, అంకితభావంతో ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేసి ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు.
ఆయన మృతిపట్ల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముక్కెర వెంకటప్ప రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, స్థానిక సాయిబాబా కమిటీ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. యన్నం రంగారెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.