వివాహేతర సంబంధం.. భర్త హత్య.. జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య!
తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసిన ఘటన కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. అనంతరం జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి.. మనూరు మండలానికి చెందిన కల్పనతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బయటకు సాఫీగా కనిపించిన ఈ కుటుంబ జీవితం.. మూడు నెలల క్రితం కొత్త మలుపు తిరిగింది.
నారాయణఖేడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కల్పనకు.. మనూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన బేగరి పండరి అలియాస్ చింటూతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారినట్లు పోలీసులు వెల్లడించారు.
తమ సంబంధానికి భర్త ముత్యం రెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించిన కల్పన, చింటూ కలిసి హత్యకు పథకం రచించినట్లు సమాచారం. పథకం ప్రకారమే ముత్యం రెడ్డిని హత్య చేసి.. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. పైగా ఎవరికీ అనుమానం రాకుండా రాళ్లు వేసి ఆనవాళ్లు చెరిపేందుకు ప్రయత్నించారు.
హత్య అనంతరం భర్త కనిపించడం లేదంటూ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసి.. మిస్సింగ్ డ్రామా ఆడినట్లు దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. కల్పన ప్రవర్తనపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు.
చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. తామే హత్య చేసినట్లు కల్పన, చింటూ ఒప్పుకున్నట్లు సమాచారం. అనంతరం పోలీసులు నిందితులు చెప్పిన ప్రదేశానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. తహశీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.