వ్యసన రహిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
వ్యసన రహిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
తిరువూరు, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయంలో బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన "నశా ముక్త్ భారత్ అభియాన్" (వ్యసన రహిత భారత్) కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కూడా వ్యసనాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలిసి "నశా ముక్త్ భారత్ అభియాన్" ప్రతిజ్ఞ చేయించి, ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.
వ్యసన రహిత భారత ప్రతిజ్ఞను ఆన్లైన్లో చేయడానికి రూపొందించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని ప్రజలకు సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం, మనశ్శాంతిని పెంపొందించుకోవడం, సమాజానికి సేవ చేయడం, జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఆధ్యాత్మిక విలువలను అలవరుచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
"నశా రహిత భారత్ – ఆరోగ్యకర భారత్ – ఆనందమయ భారత్" నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.