యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ.
యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు ఘనంగా శిక్షణ..
ఆర్థిక పారదర్శకతకే పెద్దపీట: ‘మన డబ్బులు - మన లెక్కలు’.
డిజిటల్ బాటలో 1,336 పొదుపు సంఘాల మహిళలు బ్యాంక్ మేనేజర్లు,సెర్ప్ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన..
యడ్లపాడు: గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక సాధికారత, పొదుపు సంఘాల నిర్వహణలో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP AP) సంయుక్తంగా సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా, యడ్లపాడు మండల సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక వెలుగు కార్యాలయంలో వీఓఏ (VOA)లు, ఈ-నారి (E-Nari) ప్రతినిధులకు ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మండల సమాఖ్య అధ్యక్షురాలి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సొంత ఫోన్లలోనే పొదుపు,అప్పుల లెక్కలు!..
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. "మన డబ్బులు - మన లెక్కలు" అనే ప్రధాన నినాదంతో ఈ సరికొత్త అప్లికేషన్ను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఇకపై పొదుపు సంఘాల (SHG) మహిళలు తమ పొదుపు మొత్తాలు, చెల్లించిన అప్పులు, గ్రూపునకు వచ్చే లాభనష్టాల వివరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ప్రతి సభ్యురాలూ గూగుల్ ప్లేస్టేర్ నుండి ‘సూపర్ నారి యాప్’ను డౌన్లోడ్ చేసుకుని,తమ సొంత మొబైల్ ఫోన్ ద్వారానే వ్యక్తిగత ఖాతా వివరాలను ఎలా తనిఖీ చేసుకోవాలో ఈ సందర్భంగా క్షుణ్ణంగా వివరించారు.అలాగే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా,డిజిటల్ విధానంలో గ్రూపు పుస్తకాలను పక్కాగా ఎలా నమోదు చేయాలో వీఓఏలకు ప్రాక్టికల్గా నేర్పించారు.
13,500 మంది మహిళలకు డిజిటల్ విప్లవం..
యడ్లపాడు మండల పరిధిలో విస్తరించి ఉన్న 1,336 పొదుపు సంఘాలకు చెందిన దాదాపు 13,500 మంది సభ్యురాళ్లకు ఈ సరికొత్త యాప్ ద్వారా నేరుగా లబ్ధి చేకూరనుంది. క్షేత్రస్థాయిలో ఈ సాంకేతికతను మహిళలకు చేరవేయడానికి గాను మండలంలోని ఈ-నారి ప్రతినిధులకు, సీఆర్పీ (CRP)లకు ఈ ఒక రోజు శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని వెలుగు అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ అవగాహన సదస్సులో సెర్ప్ అధికారులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు,ఏపీఎం కె. రవీంద్రకుమార్
సీసీలు వై. పెద్దయ్య, సీహెచ్. నాగేశ్వరరావు, జి. నాగేశ్వరరావు
లీగల్ కోఆర్డినేటర్ ఎస్.కె. సైదావలి
మండల సమాఖ్య ప్రతినిధులు సెక్రటరీ శ్రీలక్ష్మి, హెచ్. ద్రాక్షాయమ్మ మరియు వివిధ గ్రామ సంఘాల వీఓఏలు,ఎస్బీఐ (SBI) బ్యాంక్ మేనేజర్, వారి ఫీల్డ్ ఆఫీసర్తో పాటు యూబీఐ (UBI) బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్లు విచ్చేసి మహిళల ఆర్థిక వృద్ధికి, డిజిటల్ బ్యాంకింగ్కు గల ప్రాధాన్యతను వివరించారు.