యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి..? ఢిల్లీలో జోరుగా ప్రచారం
యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి..? ఢిల్లీలో జోరుగా ప్రచారం
కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొత్త గవర్నర్ల నియామకంపై చర్చ మొదలైంది. ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. యనమలకు గవర్నర్ పదవి దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.
పదవీకాలం ముగిసిన గవర్నర్లతో పాటు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల గవర్నర్లను మార్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, బీహార్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన యనమల రామకృష్ణుడు అనంతరం ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజ్యాంగ వ్యవహారాలు, శాసనసభ నిర్వహణపై ఆయనకు ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని గవర్నర్ పదవికి ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యనమలను ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ గవర్నర్గా నియమించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బీహార్ వంటి రాజకీయంగా కీలకమైన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరమని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం యనమల రామకృష్ణుడు టీడీపీ జాతీయ పొలిట్బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. బీసీ వర్గాల్లో యనమలకు ఉన్న పట్టు దృష్ట్యా ఆయనకు ఉన్నత పదవి ఇవ్వడం ద్వారా రాజకీయ సమీకరణాలను బలోపేతం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
యనమల కుమార్తె దివ్య తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా టీడీపీకి చెందిన మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా గవర్నర్ పదవుల కోసం వినిపిస్తున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయ సమీకరణాల్లో భాగంగా యనమల రామకృష్ణుడి వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.