యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక
ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
శ్రీశైలం, జూన్ 2: శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి 7వ సమావేశం మంగళవారం కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుతో పాటు ఇతర సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యక్షంగా హాజరయ్యారు.
సమావేశంలో మొత్తం 6 అజెండా అంశాలపై చర్చ జరగగా, వాటిలో 2 అంశాలు ఆమోదం పొందాయి. మరో 2 అంశాలు వాయిదా పడగా, 2 అంశాలు తిరస్కరించబడ్డాయి. అదనంగా మిగిలిన 21 అజెండా అంశాలను ఈ నెల 11న నిర్వహించనున్న తదుపరి ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
సమావేశంలో అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 11న ప్రత్యేక యోగా కార్యక్రమంతో పాటు జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక ప్రజలతో పాటు యాత్రికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ మరియు క్షేత్ర సుందరీకరణలో భాగంగా రాబోయే వర్షాకాలంలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. వర్షాకాలం ముగిసేలోపు క్షేత్ర పరిధిలో కనీసం 5 వేల నుంచి 6 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీడనిచ్చే మొక్కలతో పాటు దేవతా వృక్షాలను కూడా నాటాలని, వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సభ్యులు సూచించారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తరహాలో పిలిగ్రిమ్స్ అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని అధ్యక్షులు సూచించారు. అలాగే భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
సమావేశంలో సభ్యులు పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా శ్రీశైల క్షేత్ర దత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవటం దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నెలవారీ పారితోషికాన్ని పెంపుదల చేయాలని తీర్మానించారు.
ధర్మకర్తల మండలి సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, భక్తుల సౌకర్యాల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం విశేషం.