యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ధర్నా
యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ధర్నా: రూ. 30 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్
మంచిర్యాల జిల్లా తాండూరు ఐబీలోని యూనియన్ బ్యాంక్ కార్యాలయం ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. సింగరేణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొంది, యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న 70 సంవత్సరాల లోపు కోల్ మైన్స్ పెన్షనర్లకు రూ. 30 లక్షల ప్రమాద బీమాతో పాటు, సహజ మరణానికి రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు మేనేజర్ నిశాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి మరియు యూనియన్ బ్యాంక్ యాజమాన్యాల మధ్య ఫిబ్రవరి 26, 2024న జరిగిన ఒప్పందం మేరకు ఈ బీమా సౌకర్యం కల్పించాల్సి ఉన్నా, గత రెండేళ్లుగా బ్యాంక్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే వారం, పది రోజుల లోపు అర్హులైన విశ్రాంత బొగ్గు కార్మికులకు ఈ ప్రమాద బీమా సౌకర్యం కల్పించకపోతే, భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఉన్న యూనియన్ బ్యాంకు కార్యాలయాల ముందు కార్మికుల కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున శాంతియుత ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు అసం రాజయ్య, తగరం రాజన్న, తోటపల్లి ఎల్లయ్య, దేవరకొండ మౌగిలి, కే. దుర్గా స్వామి, కే. లక్ష్మి, ఎర్రయ్య, సీ. రాయలింగు, ఎడ్ల గొంతయ్య తదితరులతో పాటు మాదారం, తాండూర్, తంగళ్ళపల్లి, కొత్తపల్లి, కొత్తగుడిసెలు తదితర ప్రాంతాలకు చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు