రూ.90 వేల లంచం కేసులో నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
నారాయణపేట: ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు రూ.90 వేల లంచం డిమాండ్ చేసిన కేసులో నారాయణపేట గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకట్ స్వామిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమ్మరి నాగేశ్ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వెంకట్ స్వామి రూ.90 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జూలై 21న ప్రైవేట్ వ్యక్తి కమ్మరి నాగేశ్ ద్వారా రూ.50 వేలు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. మిగిలిన రూ.40 వేల కోసం కూడా డిమాండ్ చేసినట్లు తెలిపింది.
ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ వెంకట్ స్వామితో పాటు నాగేశ్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరినీ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసే ఉద్యోగులు, సిబ్బంది గురించి ప్రజలు ఏసీబీకి సమాచారం అందించాలని అధికారులు సూచించారు. లంచం కోరిన సందర్భాల్లో టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.