మహబూబాబాద్లో విషాదం.. భర్త ఫోన్ ఎత్తలేదని వివాహిత ఆత్మహత్య
మహబూబాబాద్: భర్త ఫోన్ ఎత్తలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల (20)కు రెండేళ్ల క్రితం మహబూబాబాద్లో గృహ రుణ సంస్థలో నిర్వాహకుడిగా పనిచేస్తున్న బాణోత్ హుస్సేన్తో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది.
ఇటీవల అఖిల పుట్టింటికి వెళ్లింది. పాప ఏడుస్తుండటంతో భర్తకు వీడియో కాల్ చేసి పాపతో మాట్లాడించేందుకు ఈ నెల 2న ప్రయత్నించింది. అయితే హుస్సేన్ ఫోన్ ఎత్తకపోవడంతో అఖిల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అనంతరం ఆమె మహబూబాబాద్లోని అత్తగారింటికి చేరుకుని ఎలుకల మందు తిన్నట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున అఖిల మృతి చెందింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఇతర కారణాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.