రాష్ట్ర పోలీస్ క్రీడల్లో అన్నమయ్య జిల్లా పోలీసుల పతకాల మోత
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా, మదనపల్లి: రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026లో అన్నమయ్య జిల్లా పోలీసులు సత్తా చాటారు. కర్నూలు రేంజ్ తరఫున వివిధ క్రీడాంశాల్లో పాల్గొన్న జిల్లా పోలీసు సిబ్బంది మొత్తం 21 పతకాలు సాధించారు.
వీటిలో 7 స్వర్ణ పతకాలు, 8 రజత పతకాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని సాధించారు. మహిళల విభాగంలో డబ్ల్యూపీసీ పి. శశికళ ప్రతిభ కనబరిచి ఏకంగా ఏడు పతకాలు సాధించారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ అభినందించి సత్కరించారు. పోలీసు విధుల్లో నిరంతరం ఒత్తిడితో పనిచేసే సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. క్రీడల ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని తెలిపారు.
పోలీసు సిబ్బంది విధులతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం అభినందనీయమని ఎస్పీ పేర్కొంటూ, భవిష్యత్లోనూ క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తామని తెలిపారు.