తిరువూరులో విద్యుత్ విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు
2,100 విద్యుత్ సర్వీసుల పరిశీలన.. 411 సర్వీసుల్లో అదనపు వినియోగం గుర్తింపు
666 కిలోవాట్ల అదనపు విద్యుత్ వినియోగానికి రూ.13.32 లక్షల జరిమానా
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు టౌన్ సెక్షన్ పరిధిలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తిరువూరు టౌన్, కోకిలంపాడు, మల్లెల, రామన్నపాలెం, కాకర్ల, లక్ష్మీపురం ప్రాంతాల్లో మొత్తం 35 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా 1,843 గృహ విద్యుత్ సర్వీసులు, 253 వాణిజ్య సర్వీసులు.. మొత్తం 2,100 సర్వీసులను అధికారులు పరిశీలించారు. ఇందులో 411 సర్వీసుల్లో అదనపు విద్యుత్ వినియోగాన్ని గుర్తించారు. మొత్తం 666 కిలోవాట్ల విద్యుత్ వినియోగానికి సంబంధించి సుమారు రూ.13.32 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం లక్ష్మీపురంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని పేర్కొన్నారు. విద్యుత్ చౌర్యానికి సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు 83310 14951, 83310 20537 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
విజిలెన్స్ ఈఈ విజయ్ కుమారి ఆధ్వర్యంలో, నూజివీడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. రాజామోహన్రావు, తిరువూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. నూజివీడు డివిజన్ పరిధిలోని డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.