www.ntodaynews.com
ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రాద్రికి భారీగా గిరి ప్రదక్షిణ
తెలంగాణ
స్వాతి నక్షత్రం సందర్భంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రాద్రికి భారీగా గిరి ప్రదక్షిణ
NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్: వినోద్ కుమార్ నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా, ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం. ఈ క్షేత్రం కదిరి పట్టణానికి సమీపంలో ఉన్న స్తోత్రాద్రి కొండపై వెలసి ఉంది.
ఖాద్రీ పురాణం ప్రకారం, నరసింహుడు లక్ష్మీ నరసింహుడిగా ప్రహ్లాదుడు మరియు సకల దేవతల స్తోత్రాల మధ్య ఈ క్షేత్రంలో వెలసినట్లు పండితులు, అర్చకులు వివరిస్తున్నారు. ‘ఖ’ అనగా విష్ణు పాదం, ‘అద్రి’ అనగా పర్వతం అనే అర్థంతో ఈ ప్రాంతానికి ఖాద్రీపురం అనే పేరు వచ్చినట్లు చెబుతున్నారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణ ప్రస్తావన ఉంది.
స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఖాద్రీ ఆలయం నుంచి భక్తులు పాదయాత్రగా బయలుదేరి, కుమ్మరవాండ్లపల్లి గ్రామం వద్ద ఉన్న కొండల నరసింహ స్తోత్రాద్రికి చేరుకున్నారు. అర్చకులు ప్రత్యేక హారతి నిర్వహించిన అనంతరం గోవింద నామస్మరణ, హరినామ కీర్తనలు, భజనలతో భక్తులు భారీగా గిరి ప్రదక్షిణ చేశారు.
భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణ ప్రముఖులు శ్రీనివాసులు, రమేష్ రెడ్డి, వీర శేఖర్, వెంకటేష్ తదితరులు కదిరి కొండ వద్ద భక్తులకు మహా ప్రసాదం (అల్పాహారం) ఏర్పాటు చేశారు.
ఈ గిరి ప్రదక్షిణలో మహిళలు, యువకులు, పిల్లలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెలా స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కొండ చుట్టూ రహదారి ఏర్పాటు చేస్తే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని సేవా సమితి సభ్యులు, హిందూ ధార్మిక సంస్థలు మరియు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
#SwathiNakshatra
#GiriPradakshina
#NarasimhaSwamy
#KadiriHills
#TempleNews
#DevotionalEvent
#Bhakti
#AndhraPradeshNews
#SpiritualJourney
Follow us on
Website
Facebook
Instagram
YouTube 