ఆగిరిపల్లిలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్, ఆగిరిపల్లి ఎస్ఐ ఎన్. శుభశేఖర్ స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో రూరల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రౌడీ షీటర్ల ప్రస్తుత ప్రవర్తన, జీవన విధానం, వారిపై నమోదైన కేసుల స్థితిగతులను అధికారులు సమీక్షించారు. పాత కక్షలు, వివాదాలను కొనసాగిస్తూ మళ్లీ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కొత్త చట్టాల ప్రకారం కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
పాత నేరచరిత్రను విడిచిపెట్టి బాధ్యతాయుత పౌరులుగా సత్ప్రవర్తనతో జీవించాలని, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై బీట్ సిబ్బంది, ఇంటెలిజెన్స్ విభాగం నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు.
స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని, ప్రతి ఒక్కరూ స్థానిక పోలీస్ స్టేషన్లో విధిగా హాజరై నమోదు చేసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బైండోవర్ చర్యలు, నగర బహిష్కరణ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా సహించబోమని, రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకుని ప్రశాంత జీవనం సాగించాలని ఎస్ఐ ఎన్. శుభశేఖర్ పేర్కొన్నారు.