ఆగస్టు 25 లోగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలి
ఆగస్టు 25 లోగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలి
- ఆరుతడి పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలి
- వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆగస్టు 25వ తేదీలోగా రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కొలతలు తీసుకుని స్వయం సహాయక సంఘాల మహిళలు, మాస్టర్ టైలర్ల ద్వారా త్వరగా దుస్తులు కుట్టించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే, ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున వరికి ప్రత్యామ్నాయంగా కందులు, పెసర్లు, కూరగాయల వంటి ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్ణీత గడువులోగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని సీఎస్ కు వివరించారు. లోటు వర్షపాతం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, డీఆర్డీఓ కిషన్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఉద్యానవన అధికారి అనిత, ముఖ్య ప్రణాళిక అధికారి తదితరులు పాల్గొన్నారు