ఆగస్టు 26న మధిరలో ఉచిత రక్తదాన శిబిరం
ఆగస్టు 26న మధిరలో ఉచిత రక్తదాన శిబిరం తలసేమియా బాధితులకు అండగా నిలవాలి : మౌలానా షేక్ ముజాహిద్
మధిర: మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 26న మధిర పట్టణంలోని షాదీఖానాలో భారీ ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్ తెలిపారు.
ఆదివారం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్ నివాసంలో జరిగిన సమావేశంలో మౌలానా మాట్లాడారు. ఆగస్టు 26న ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు.
మహమ్మద్ ప్రవక్త అందించిన ప్రేమ, సోదరభావం, మానవ సేవ సందేశాన్ని ఆచరణలో చూపించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. రక్తదానం చేయడం ద్వారా ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడటంతో పాటు అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
మధిర పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల యువత, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మౌలానా షేక్ ముజాహిద్ విజ్ఞప్తి చేశారు. తమ స్నేహితులు, బంధువులను కూడా ప్రోత్సహించాలని కోరారు.
ఈ సమావేశంలో సంఘం నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.