ఆగస్టు 3 నుంచి రైల్వే గ్రూప్-డి పరీక్షలు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ఆధ్వర్యంలో 22,195 గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) ఆగస్టు 3 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం పరీక్ష నగర సమాచారం (సిటీ ఇంటిమేషన్ స్లిప్)ను ఆర్ఆర్బీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
అభ్యర్థులు తమ నమోదు వివరాలతో అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి పరీక్ష తేదీ, షిఫ్ట్, పరీక్ష జరిగే నగరం వంటి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ స్లిప్లో పరీక్ష కేంద్రం పూర్తి చిరునామా ఉండదు. ఆ వివరాలు పరీక్షకు నాలుగు రోజుల ముందు విడుదల చేసే అడ్మిట్ కార్డులో మాత్రమే ఉంటాయి.
పరీక్ష రోజున అడ్మిట్ కార్డుతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. అలాగే పరీక్షకు సంబంధించిన అన్ని తాజా ప్రకటనలు, అడ్మిట్ కార్డు విడుదల వంటి వివరాల కోసం అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.