ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు
అమరావతి, జూలై 25: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.