ఆస్ట్రేలియా కలల ఉద్యోగానికి గుడ్బై.. గేదెల పెంపకంతో ఏడాదికి రూ.80 లక్షల ఆదాయం!
విదేశాల్లో ఉద్యోగం, భారీ జీతం, విలాసవంతమైన జీవితం.. ఇవే చాలా మంది యువత కలలు. కానీ పంజాబ్కు చెందిన యువ ఇంజనీర్ అమృత్పాల్ సింగ్ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి తిరిగి వచ్చి గేదెల పెంపకాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు అదే నిర్ణయం అతన్ని విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలబెట్టింది.
బీటెక్ పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య, ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అమృత్పాల్కు అక్కడ మంచి జీతంతో కూడిన ఇంజనీరింగ్ ఉద్యోగం లభించింది. అయితే స్వదేశం, గ్రామీణ జీవితం, తన నేలపై ఏదో సాధించాలనే తపన అతన్ని తిరిగి పంజాబ్కు తీసుకొచ్చింది.
గ్రామానికి వచ్చిన తర్వాత గేదెల పెంపకం ప్రారంభిస్తానని చెప్పడంతో చాలామంది ఎగతాళి చేశారు. ఇంజనీర్గా విదేశాల్లో పనిచేసిన వ్యక్తి పాడి పరిశ్రమలోకి దిగడాన్ని చాలామంది ఆశ్చర్యంగా చూశారు. కానీ అమృత్పాల్ దీనిని కేవలం పాడి వ్యాపారంగా కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యాపార అవకాశంగా మలిచాడు.
అత్యుత్తమ జాతి గేదెలతో ఆధునిక డెయిరీ ఫామ్ను ఏర్పాటు చేసిన ఆయన, పశువుల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, పాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. సాంకేతిక పద్ధతులతో నిర్వహిస్తున్న ఈ డెయిరీ ఫామ్ నుంచి ఉత్పత్తయ్యే పాలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో కొద్ది కాలంలోనే ఆయన వ్యాపారం కోట్ల రూపాయల టర్నోవర్ దిశగా అడుగులు వేసింది.
ఇదే కాకుండా తన కార్పొరేట్ అనుభవాన్ని ఉపయోగించి స్టార్టప్ కన్సల్టెన్సీని కూడా ప్రారంభించాడు. యువ పారిశ్రామికవేత్తలకు వ్యాపార ప్రణాళికలు, మార్కెటింగ్ వ్యూహాలు, ఆదాయ వనరులపై మార్గదర్శకత్వం అందిస్తున్నాడు.
గేదెల పెంపకం, స్టార్టప్ కన్సల్టెన్సీ.. ఈ రెండు రంగాల్లో సాధించిన విజయంతో అమృత్పాల్ సింగ్ ప్రస్తుతం సంవత్సరానికి రూ.80 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాడు.
విదేశీ ఉద్యోగాలే విజయానికి మార్గం కాదని, సొంత నేలపై కష్టపడి పనిచేస్తే వ్యవసాయం, పాడి పరిశ్రమల్లోనూ అపార అవకాశాలు ఉన్నాయని అమృత్పాల్ సింగ్ తన విజయగాథతో నిరూపించాడు. నేటి యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకంగా మారింది.