ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాల ఫైర్.. సీజేఐకి 23 పార్టీల సంయుక్త లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఇండియా బ్లాక్కు చెందిన 23 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు సంయుక్తంగా లేఖ రాశాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోట్లాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
దేశంలోని అన్ని వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజాస్వామ్యం న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తుందని, అందుకే ఎన్నికల ప్రక్రియపై న్యాయ సమీక్ష అవసరమని ప్రతిపక్షాలు లేఖలో పేర్కొన్నాయి. బీహార్లో ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియను ఇతర రాష్ట్రాలకు విస్తరించి, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపాయి.
పశ్చిమ బెంగాల్లో 27 లక్షల మంది ఓటర్లను ప్రత్యేక కేటగిరీలో చేర్చడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అలాగే ఎస్ఐఆర్ నుంచి మినహాయించబడిన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందకుండా చేస్తున్నారని పేర్కొన్నాయి.
'అక్రమ వలసదారులను గుర్తించడమే ఎస్ఐఆర్ లక్ష్యం' అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించి జాబితా నుంచి తొలగించారనే వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించలేదని లేఖలో విమర్శించారు.
ఈ సంయుక్త లేఖపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్, ఒమర్ అబ్దుల్లా, కపిల్ సిబల్ తదితరులు సంతకాలు చేశారు.
రాజ్యసభ సభ్యురాలు సాగరిక ఘోష్ మాట్లాడుతూ, బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నాలపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా కోరుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాల ఐక్యత అపూర్వమని ఆమె వ్యాఖ్యానించారు.