పాస్పోర్ట్తో పౌరసత్వం రుజువు కాదా? దేశవ్యాప్తంగా కొత్త సందిగ్ధానికి కేంద్రం వివరణ
పౌరసత్వంపై కొత్త సందిగ్ధం
భారతీయుడిగా తన గుర్తింపుపై ఎప్పుడూ సందేహం లేని సాధారణ పౌరుడికి ఇప్పుడు "నేను భారతీయుడినని నిరూపించే పత్రం ఏది?" అనే ప్రశ్న ఎదురవుతోంది. పాస్పోర్ట్ పౌరసత్వానికి ప్రత్యక్ష ప్రమాణ పత్రం కాదన్న విదేశాంగ శాఖ వివరణ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
సాధారణంగా ప్రజలు పాస్పోర్ట్ను భారతీయ పౌరసత్వానికి అత్యున్నత ధ్రువీకరణ పత్రంగా భావిస్తారు. ఎందుకంటే పాస్పోర్ట్ పొందే ప్రక్రియలో పత్రాల పరిశీలన, పోలీసు ధృవీకరణ వంటి కఠిన నిబంధనలు అమలులో ఉంటాయి. అయితే అది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని కేంద్రం వివరణ ఇవ్వడం ప్రజల్లో గందరగోళాన్ని పెంచింది.
పాస్పోర్ట్ పౌరసత్వానికి ప్రమాణం కాకపోతే మరి ఏ పత్రం ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. ఆధార్, ఓటర్ ఐడీ గుర్తింపు పత్రాలే కానీ పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు కావు. మరోవైపు దేశంలోని కోట్లాది మందికి జనన ధ్రువీకరణ పత్రాలు కూడా అందుబాటులో లేవు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ నిర్ధారణకు సంబంధించి స్పష్టమైన, ఏకీకృత మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)పై ఇప్పటికే ఆందోళనలు నెలకొన్న వేళ పాస్పోర్ట్పై వచ్చిన ఈ వివరణ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ప్రపంచంలోని అనేక దేశాల్లో పాస్పోర్ట్తో పాటు ప్రత్యేక పౌరసత్వ కార్డును జారీ చేసే విధానం అమలులో ఉంది. అలాంటి వ్యవస్థను భారతదేశంలోనూ ప్రవేశపెడితే పౌరసత్వంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో "భారతీయుడిని నిరూపించే అసలు పత్రం ఏది?" అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఇంకా చర్చనీయాంశంగానే మిగిలిపోతుంది.