ఆటోల్లో మితిమీరిన ప్రయాణికులు వద్దు.. డ్రైవర్లకు పోలీసుల కౌన్సిలింగ్
కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జొన్నపాడు గ్రామంలో ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గుడివాడ రూరల్ సీఐ ఎస్.ఎల్.వి. సోమేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని తెలిపారు. ప్రయాణికుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఓవర్లోడింగ్ చేయవద్దని సూచించారు.
డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.