ఏడేళ్లలోపు వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త, అత్తింటివారిపై బాధ్యత!
ఏడేళ్లలోపు వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త, అత్తింటివారిపై బాధ్యత!
కట్నం వేధింపులకు ఆధారాలుంటే వరకట్న హత్యగా పరిగణించొచ్చు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అలహాబాద్: వివాహమైన ఏడేళ్లలోపు మహిళ అసహజ పరిస్థితుల్లో మృతి చెందితే, ఆమెను కట్నం కోసం వేధించినట్లు ఆధారాలు లభిస్తే ఆ మరణాన్ని వరకట్న హత్యగా పరిగణించే అవకాశం ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో మహిళ మృతికి భర్త లేదా అత్తింటి సభ్యుల ప్రత్యక్ష ప్రమేయాన్ని నిరూపించేందుకు ప్రత్యేకంగా అదనపు సాక్ష్యాలు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.
వరకట్న వేధింపుల నేపథ్యంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును విచారించిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సందీప్ సింగ్ హోరాకు దిగువ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు పరిశీలించింది. కేసులో అతని భార్య అత్తింట్లో అసహజ పరిస్థితుల్లో మృతి చెందినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది.
అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధించేందుకు దిగువ కోర్టు తగిన కారణాలను స్పష్టంగా నమోదు చేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో శిక్ష తీవ్రతను పునఃపరిశీలించి యావజ్జీవ కారాగారాన్ని 10 ఏళ్ల జైలుశిక్షకు తగ్గించింది.
వివాహిత మహిళ వివాహం జరిగిన ఏడేళ్లలోపు మరణించడం, అంతకుముందు కట్నం కోసం వేధింపులకు గురైనట్లు ఆధారాలు ఉండటం వంటి అంశాలు వరకట్న హత్య కేసుల్లో కీలకంగా మారతాయని న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రతి కేసులో అందుబాటులో ఉన్న ఆధారాలు, పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నేర నిర్ధారణ, శిక్షపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.