ఏలూరులో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నూతన నివాసం, క్యాంపు కార్యాలయం ప్రారంభం.. ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశం
ఏలూరు జిల్లా:
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరులో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఏలూరు వట్లూరు పంచాయతీ పరిధిలోని సీతాపురం కాలనీలో నిర్మించిన నూతన గృహం, పక్కనే ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి విందు ఏర్పాటు చేశారు.
ప్రతి నెల ఒక ప్రజాప్రతినిధి నివాసంలో నిర్వహించే ఆత్మీయ సమావేశాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, కైకలూరు నియోజకవర్గ టీడీపీ నేత కొడాలి వినోద్ తదితరులు హాజరయ్యారు.
ఆత్మీయ విందు సందర్భంగా ఎమ్మెల్యేలు, నాయకులు ఎంపీ నూతన నివాసాన్ని సందర్శించి కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం వచ్చిన అతిథులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్వయంగా వీడ్కోలు పలికారు.
కొత్త కార్యాలయంలో ప్రజా సేవలు ప్రారంభం
సీతాపురంలో నిర్మించిన నూతన క్యాంపు కార్యాలయంలో సోమవారం నుంచి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎంపీ తన సిబ్బందితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.
కొత్త కార్యాలయానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీకి నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల అభిమానమే తనకు గొప్ప బలమని, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
సీతాపురం నాలుగో లైన్లోని నూతన క్యాంపు కార్యాలయం నుంచి ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎంపీ వెల్లడించారు.