ఏం గుండె సామీ నీది..! ఏకంగా మొసలి ముందే కూర్చొని పూజలు
ఏం గుండె సామీ నీది..! ఏకంగా మొసలి ముందే కూర్చొని పూజలు
కృష్ణానది తీరంలో ఆశ్చర్యకర ఘటన.. భయపడిన భక్తులు.. ధైర్యంగా పూజలు చేసిన పురోహితుడు
జోగులాంబ గద్వాల జిల్లా: కృష్ణానది తీరంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన భక్తులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ వద్దకు రావడంతో అక్కడ ఉన్న సందర్శకులు, భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొసలిని చూసి భయపడాల్సిన పురోహితుడు ఏకంగా దాని ఎదురుగానే కూర్చొని పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణానది పుష్కర ఘాట్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వరుస సెలవులు కావడంతో బీచుపల్లి పుష్కర ఘాట్కు పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలివచ్చారు. కృష్ణమ్మను దర్శించుకుని, నదీతీరంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు నది అందాలను తిలకిస్తుండగా ఒక్కసారిగా మొసలి ప్రత్యక్షమైంది.
నదిలో నుంచి బయటకు వచ్చిన మొసలి నెమ్మదిగా పుష్కర ఘాట్ వైపు రావడంతో అక్కడున్న వారిలో కలకలం రేగింది. కొందరు భక్తులు దూరంగా పరుగులు తీయగా.. మరికొందరు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మొసలిని గమనించారు. అంతటితో ఆగకుండా ఆ మొసలి ఓ భవనంలోకి ప్రవేశించడంతో భయం మరింత పెరిగింది.
మొసలి ముందు కూర్చొని మంత్రాలు..!
ఈ విషయం తెలుసుకున్న పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం ఏమాత్రం బెదరకుండా మొసలి వద్దకు వెళ్లారు. ఏకంగా దాని ఎదురుగానే కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు ప్రారంభించారు. కుంకుమ, పసుపు, పుష్పాలతో మొసలికి పూజలు నిర్వహించడం చూసిన అక్కడి భక్తులు అవాక్కయ్యారు.
‘మొసలికి ఇంత ధైర్యంగా పూజలు చేస్తున్నాడేంటి?’ అంటూ అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. మొసలి ఎలాంటి కదలికలు చేయకుండా ఉండటంతో పురోహితుడు తన పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు.
వరుణ దేవుడి వాహనంగా భావించి పూజలు
మొసలి వరుణ దేవుడి వాహనం అని పురోహితుడు అనిల్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు పంటలు పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మొసలికి పూజలు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న వారి ద్వారా బయటకు రావడంతో ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు మొసలి పుష్కర ఘాట్కు రావడం.. మరోవైపు దాని ముందే కూర్చొని పురోహితుడు పూజలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.