ఏసీబీ దాడుల్లో భూపరిపాలన శాఖ అధికారి ఇంట భారీ అక్రమాస్తులు వెలుగులోకి
తెలంగాణ భూపరిపాలన, సర్వే విభాగంలో పనిచేస్తున్న మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఉదయం హైదరాబాద్తో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు చేపట్టిన ఈ తనిఖీల్లో నరహరి నివాసంలో రూ.1.54 కోట్ల నగదు లభ్యమైంది. నగదును బెడ్రూమ్లోని బీరువా పైభాగంలో దాచినట్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అలాగే సుమారు ఒక కిలో బంగారం, పలు కీలక ఆస్తి పత్రాలు కూడా సీజ్ చేశారు. నారాయణగూడలోని కార్యాలయం, బంధువులు మరియు సన్నిహితుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిపారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.5 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అదనంగా కోటి రూపాయలకు పైగా విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. వాటి పూర్తి వివరాల కోసం సంబంధిత బ్యాంకులకు లేఖలు పంపించారు.
అధికారిని ఏసీబీ అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తోంది.