అమ్మిరెడ్డిగూడెంలో పోలీసుల పల్లె నిద్ర
ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో రాత్రి బస చేసిన పోలీసులు.. ప్రజలకు భరోసా
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, అమ్మిరెడ్డిగూడెం:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో అమ్మిరెడ్డిగూడెం గ్రామంలో పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ మార్గదర్శకత్వంలో, మైలవరం ఏసీపీ రామచంద్రరావు పర్యవేక్షణలో, తిరువూరు సీఐ కే. గిరిబాబు సూచనలతో గంపలగూడెం ఎస్సై జీ. అనిల్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో రాత్రి బస చేశారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలోని సున్నిత ప్రాంతాలను పరిశీలించి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రలోభాలు, బెదిరింపులకు గురికాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ‘ఖాకీ స్టూడియో’ వీడియో ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామంలోని యువత గంజాయి, బెట్టింగ్లు, వేగంగా వాహనాలు నడపడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పోలీసులు సూచించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడటమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజల రక్షణకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని అధికారులు తెలిపారు. పోలీసులు స్వయంగా గ్రామంలో బస చేసి సమస్యలు తెలుసుకోవడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.