పెదకోమిరలో రూ.50 కోట్ల ప్రభుత్వ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్లపై వైసీపీ ఫిర్యాదు
జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైసీపీ నేతలు.. సమగ్ర విచారణకు డిమాండ్
విజయవాడ:
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెదకోమిర గ్రామ పంచాయతీ పరిధిలోని తోటమూల రింగ్ సెంటర్ వద్ద ఉన్న విలువైన ప్రభుత్వ కమర్షియల్ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు వినతిపత్రం సమర్పించారు.
వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తిరువూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ జడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కావూరి వినయ్ కుమార్ తదితరులు జాయింట్ కలెక్టర్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామి దాస్ సమర్పించిన అర్జీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. పెదకోమిర గ్రామ పంచాయతీ పరిధిలో తోటమూల రింగ్ సెంటర్ వద్ద మధిర వైపు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లు 62/1, 62/4, 63/3లలో మొత్తం 90 సెంట్ల ప్రభుత్వ కమర్షియల్ స్థలం ఉందని తెలిపారు.
బహిరంగ మార్కెట్లో సెంటు రూ.50 లక్షల వరకు ధర ఉండటంతో ఈ స్థలం విలువ సుమారు రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అర్జీలో పేర్కొన్నారు.
2025 జనవరి 29న ప్రభుత్వం జారీ చేసిన క్రమబద్ధీకరణ జీవో ఎంఎస్ నెంబర్ 30 నిబంధనలకు విరుద్ధంగా ఈ స్థలాన్ని ఐదుగురు వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఆర్డీవో ప్రొసీడింగ్స్ ఆధారంగా, తహసీల్దార్ ఏజెంటుగా వీఆర్వో ద్వారా తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొన్నారు.
సర్వే నెంబర్ 62/4లో బూరుగు అంజలి, బోడపాటి బుజ్జి, వలపనబోయిన సీతామహాలక్ష్మి, బోడపాటి భద్రాచలం, షేక్ మస్తాన్ పేర్లపై రిజిస్ట్రేషన్లు జరిగాయని, వీరిలో కొందరికి ఇప్పటికే ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించినట్లు అర్జీలో వివరించారు.
జీవో ఎంఎస్ నెంబర్ 30 నిబంధనల ప్రకారం లబ్ధిదారుల కుటుంబంలో ఎవరికీ మరో ఇంటి స్థలం ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ దానిని పక్కనబెట్టి రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. అలాగే కొందరు అనధికార వ్యక్తులు లబ్ధిదారుల నుంచి ఖాళీ స్టాంప్ పేపర్లు, బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకుని భూమి వాటాల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదేవిధంగా సర్వే నెంబర్ 34లో 77 మంది గృహ యజమానుల నుంచి డాక్యుమెంట్కు రూ.5 వేలు, సెంటుకు రూ.1000 చొప్పున అనధికార వసూళ్లు చేస్తున్నారని, దీనిపై ప్రశ్నించిన వారి రిజిస్ట్రేషన్ పత్రాలను నిలిపివేస్తున్నారని ఆరోపించారు.
సర్వే నెంబర్ 62/4లో జరిగిన రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపి రద్దు చేయాలని, ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు జాయింట్ కలెక్టర్ను కోరారు. అలాగే సర్వే నెంబర్ 34లో జరిగిన అక్రమ వసూళ్లపై విచారణ జరిపి మిగిలిన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు.